ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల్లో కర్నూలు జిల్లా ప్రథమ స్థానం
సాధారణ కాన్పులకు పెద్దపీట -జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, ఏప్రిల్ 2, (రిపబ్లిక్ న్యూస్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల్లో కర్నూలు జిల్లా ప్రథమ స్థానం సాధించిందని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధికంగా ప్రసవాలు నిర్వహించి కర్నూలు జిల్లా రాష్ట్రంలో టాప్ లో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. 2025 ఏప్రిల్ నుండి 2026 ఫిబ్రవరి వరకు 11 నెలలకు 5500 ప్రసవాలు లక్ష్యం కాగా లక్ష్యానికి మించి 145 శాతం తో 7982 ప్రసవాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో సాధారణ ప్రసవాలు 5881 కాగా, సిజేరియన్ కాన్పులు 2101 చేశామన్నారు. 30 శాతం మించి సిజేరియన్ కాన్పులు జరగకూడదని, జిల్లాలో 26 శాతం మాత్రమే సిజేరియన్ కాన్పులు చేసి, సాధారణ కాన్పులకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎంసిహెచ్ ఆదోని, ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, వెల్దుర్తి, ఓర్వకల్లు సీహెచ్సీ ల్లో ఈ ప్రసవాలు జరిగాయని కలెక్టర్ వివరించారు.

